సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్-2026 పోస్టర్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
జనవరి 22 నుంచి 24 వరకు..
అమరావతి: విద్యార్ధులు, కాలేజీ యువతలో రాకెట్ల తయారీ నైపుణ్యాలను వెలికి తీసేలా సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్ పోటీలను రాష్ట్రప్రభుత్వం నిర్వహించనుంది. దీనికి సంబంధించి సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్ 2K26 పోస్టర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఆవిష్కరించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జనవరి 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో ఫైనల్స్ జరగనున్నాయి. దీనికి సంబంధించిన పోస్టర్ను సచివాలయంలో సీఎం ఆవిష్కరించారు. సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఆధ్వర్యంలో మొట్టమొదటి సారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, రవాణా, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సీఎంకు వివరించారు.
కాలేజీ స్థాయిలో కెమికల్ రాకెట్రీ, పాఠశాల స్థాయిలో హైడ్రో రాకెట్రీ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కెమికల్ రాకెట్రీ విభాగంలో 16 ఏళ్లకు పైబడిన వారు, హైడ్రో రాకెట్రీ విభాగంలో 6 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న వారు పాల్గొననున్నారని తెలిపారు. కళాశాల యువత,తో పాటు పాఠశాల విద్యార్ధుల్లో నూతన ఆవిష్కరణల్ని, ఆలోచనల్ని వెలికి తీసేలా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.రిజిస్ట్రేషన్ల కోసం(http://www.sciencecity.ap.gov.in/rocketry_challenge.aspx) వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

