అమరావతిలో ఘనంగా ప్రారంభమైన ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టి20 క్రికెట్ టోర్నమెంట్
అమరావతి: మంగళగిరి 6వ బెటాలియన్ APSPలో రెండవ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టి20 క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐజీపీ స్పోర్ట్స్ కే.వి. మోహన్ రావు, డీఐజీ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ కేకేఎన్ అనుబు రాజన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీసు జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. సుమారు ఆరు రాష్ట్రాల నుంచి మొత్తం 10 జట్లు పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచులు ఐదు రోజుల పాటు మూలపాడు గ్రౌండ్లో జరగనున్నాయి. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, పోలీసులు అను నిత్యం ప్రజా భద్రత కోసం 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు పోలీసుల్లో ఐక్యతను పెంపొందించడమే కాకుండా, శారీరక-మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని తెలిపారు. క్రీడల్లో పాల్గొనడం ముఖ్యం గాని గెలుపు మాత్రమే లక్ష్యం కాదని,, క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో దోహదపడతాయని ఆమె అభిప్రాయపడ్డారు.

