సింహాచలం అప్పన్న స్వామికి వైభవంగా చందన సమర్పణ
అమరావతి: ఆషాడ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన అప్పన్న స్వామికి చివరివిడత చందన సమర్పణ సంప్రదాయ బద్ధంగా జరిగింది.గురువారం అర్చకులు వేకువజామున స్వామికి విశేష పూజలు నిర్వహించి సుగంధ ద్రవ్యాలు మిళితం చేసిన మూడు మణుగుల (సుమారు 125) కిలోల శ్రీగంధాన్ని సమర్పించారు. గిరి ప్రదక్షణ పూర్తి చేసుకొని వచ్చిన అశేష భక్తజనం స్వామిని దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణ చేయలేని భక్తుల కోసం దేవస్థానం అధికారులు,,ఆలయ ప్రదక్షిణకు అవకాశం కల్పించారు. వేలాది మంది భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసి మొక్కు చెల్లించుకున్నారు. బుధవారం రాత్రి గిరి ప్రదక్షిణ ప్రారంభించిన భక్తులు ఇంకా సింహాచలం క్షేత్రానికి చేరుకుంటున్నారు. దీంతో గోపాలపట్నం నుంచి సింహాచలం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి భక్తజనంతో కిక్కిరిసిపోయింది.