తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణే మనందరి బాధ్యత-స్పీకర్ అయ్యన్నపాత్రుడు
’అమ్మ-నాన్న’ పిలుపులోని..
అమరావతి: తెలుగు భాషను పరిరక్షించుకోవడం, మన సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు అందించడం ప్రతి తెలుగువాడి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. గుంటూరు వేదికగా మూడు రోజుల పాటు అట్టహాసంగా సాగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక:- ఈ మహాసభల వేదికకు స్వర్గీయ ‘నందమూరి తారక రామారావు’ గారి పేరు పెట్టడంపై స్పీకర్ హర్షం వ్యక్తం చేశారు. విశ్వవ్యాప్తంగా తెలుగువాడి గొప్పతనాన్ని చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు గారి సమక్షంలోనూ తెలుగువారి ఆత్మగౌరవం విషయంలో ఎన్టీఆర్ రాజీపడలేదని, పార్టీ పేరులోనే ‘తెలుగు’ను పెట్టుకున్న మహోన్నత వ్యక్తి అని స్పీకర్ గారు ప్రశంసించారు.
పరభాషా వ్యామోహం వీడాలి:- ప్రస్తుత సమాజంలో పిల్లలు పరభాషా వ్యామోహంలో పడి మాతృభాషకు దూరమవుతున్నారని స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ అమ్మ-నాన్న’ అనే పిలుపులో ఉన్న మాధుర్యం, ఆప్యాయత… ‘మమ్మీ-డాడీ’ అనే పిలుపుల్లో ఉండదని తల్లిదండ్రులు గ్రహించాలన్నారు. ఇంట్లో పిల్లలతో తెలుగులోనే మాట్లాడాలని, భోజన సమయంలో సెల్ ఫోన్లను పక్కనపెట్టి కుటుంబ సభ్యులతో గడపాలని హితవు పలికారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి వంటి పండుగల ప్రాభవం తగ్గుతుండడం, మన తెలుగు సంవత్సరాదిని మర్చిపోయి డిసెంబర్ 31 వేడుకలకు ప్రాధాన్యత ఇవ్వడం విచారకరమన్నారు. అలాగే కనుమరుగవుతున్న సత్యహరిశ్చంద్ర, రామాంజనేయ యుద్ధం వంటి పద్య నాటకాలను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పారు.
విద్యార్థులకు సమగ్ర వికాసం అవసరం:- రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, కాన్వెంట్ అనే తేడా లేకుండా ప్రతి పాఠశాలలో తెలుగు భాషను తప్పనిసరి పాఠ్యాంశం చేయాలని స్పీకర్ అభిప్రాయపడ్డారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడలు, యోగా, ఎన్.సి.సి, రెడ్ క్రాస్ వంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించి, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు.
సుమారు 40 దేశాల నుండి ప్రతినిధులను రప్పించి, ఈ మహాసభలను విజయవంతం చేసిన నిర్వాహకులు గజల్ శ్రీనివాస్, వారి బృందాన్ని స్పీకర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యంగా అమరావతి గీతాలాపన నృత్య ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది.

