AP&TGBUSINESSOTHERS

విశాఖ తీరాన   హయత్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి కందుల దుర్గేష్

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ పటంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో విశాఖపట్నంలోని సాగర్ నగర్-ఎండాడ సమీపంలో (సన్ ఇంటర్నేషనల్ స్కూల్ వెనుక) పీవీఆర్ గ్రూప్‌కు చెందిన ప్రతిష్టాత్మక ‘హయత్’ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మేల్యే గంటా శ్రీనివాసరావు శనివారం భూమి పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ దాదాపు రూ.250 కోట్ల భారీ పెట్టుబడితో 3 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ హోటల్ నిర్మితమవుతోందని, రెండేళ్ల కాలపరిమితిలో ఇది అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం ‘గ్లోబల్ సిటీ’గా ఎదుగుతున్న తరుణంలో, ఈ నూతన హోటల్ పర్యాటక రంగానికి వెన్నెముకగా నిలవనుందని పేర్కొన్నారు. జాతీయ,అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్ సమావేశాలు, ప్రోత్సాహక కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించుకోవడానికి అత్యున్నత సాంకేతికతతో కూడిన కాన్ఫరెన్స్ హాళ్లు ఇక్కడ అందుబాటులోకి రానున్నాయన్నారు. విశాఖకు వచ్చే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారి అభిరుచులకు తగ్గట్టుగా లోకల్,గ్లోబల్ వంటకాలతో కూడిన ఫైన్ డైనింగ్ అనుభూతిని ఈ హోటల్ అందించనుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు ఆతిథ్య రంగంలో భారీగా ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి లభించనుందని స్పష్టం చేశారు.విశాఖకు స్టార్ హోటళ్ల రాక వల్ల నగర ముఖచిత్రాన్ని మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్,ఇతర ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *