డిసెంబర్ నాటికి నగరంలో కాలువల పనులు పూర్తి-మంత్రి నారాయణ
నెల్లూరు: అభివృద్ధిపై ఆత్మపరిశీలన చేసుకొని ఆరోపణలు చేయాలని,ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ది,రెండేళ్ల కూటమి పాలనలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకొని విమర్శలు చేయాలని మంత్రి నారాయణ సూచించారు. నగరంలో అదివారం మంత్రి సుడిగాలి పర్యటన చేశారు.కాలువలు, పాఠశాలల ఆధునీకరణ పనుల పురోగతిని పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల ప్రభుత్వ కాలంలో నగర అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు.గతంలో తాము 1100 కోట్లతో ప్రారంభించిన యూజీడీ, డ్రింకింగ్ వాటర్ పనులను పట్టించుకోకుండా వదిలేశారని విమర్శించారు.విపక్షాలు ఎన్ని అవాకులు చవాకులు పేలినా చెట్ల పెంపకంపై ఎంత రచ్చ చేసినా అభివృద్ధినిఅడ్డుకోలేరన్నారు. ఐదేళ్లలో నెల్లూరుకు ఏం చేశారో వారు అంతరాత్మ సాక్షిగా ప్రశ్నించుకోవాలని చురకలంటించారు. గతంలో వచ్చిన వరదల దుస్థితి నెల్లూరుకు రాకూడదనే ఉద్దేశంతో 50 కోట్ల బడ్జెట్తో చేపట్టిన 15 మేజర్ కాలువల ఆధునీకరణ పనులను శరవేగంగా పూర్తి చేయిస్తున్నామని, ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్న 8 డ్రైన్ల పనులతో పాటు మిగిలిన వాటన్నింటినీ డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.

