బ్యాంకు అధికారుల అండతో సైబర్ మోసాలు-‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0
32 మంది బ్యాంకు అధికారులు అరెస్ట్..
రూ. 150 కోట్ల మేర మోసాలు..
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సాగుతున్న భారీ సైబర్ మోసాల నెట్వర్క్ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్-2.O’ పేరుతో నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్లో మొత్తం 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి, బ్యాంకు అధికారులు సహా 52 మంది నిందితులను అరెస్టు చేశారు.
ముఠాలకు అండగా బ్యాంకు అధికారులే:- పెట్టుబడి స్కామ్లు, ట్రేడింగ్ మోసాలు, ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో అమాయకులను బెదిరించి భారీగా సొమ్ము దోచుకుంటున్న ముఠాలకు అండగా నిలుస్తున్న బ్యాంకు అధికారులే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగింది. నిందితుల్లో 32 మంది బ్యాంకు అధికారులు, 15 మంది మ్యూల్ ఖాతాదారులు, ఐదుగురు మధ్యవర్తులు ఉన్నారు. సైబర్ నేరగాళ్లతో కుమ్మక్కైన కొందరు బ్యాంకు అధికారులు.. వారి కోసం అక్రమంగా బ్యాంకు ఖాతాలు (మ్యూల్ అకౌంట్స్) తెరిచి ఇస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
విడతగా ‘ఆపరేషన్ ఆక్టోపస్-2’:- హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ వి.అరవింద్ బాబు, ఏసీపీ ఆర్.జి.శివ మారుతి నేతృత్వంలో 16 ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. మొత్తం 7 రోజుల పాటు తొమ్మిది రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి నెట్వర్క్ ను ఛేదించాయి. ఫిబ్రవరిలో నిర్వహించిన ‘ఆపరేషన్ ఆక్టోపస్-1’లో 16 రాష్ట్రాల నుంచి 117 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆపరేషన్లో వెలుగు చూసిన అంశాల ఆధారంగా ఇప్పుడు రెండో విడతగా ‘ఆపరేషన్ ఆక్టోపస్-2’ చేపట్టారు.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (CCPS) జరిపిన లోతైన దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల సొమ్మును దారి మళ్లించేందుకు నేరగాళ్లు ఏకంగా 350 బ్యాంకు ఖాతాలను వినియోగించారు. ఈ ఖాతాలకు దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 850 సైబర్ కేసులతో సంబంధం ఉంది. వీటి ద్వారా దాదాపు రూ.150 కోట్ల మేర మోసాలు దర్యాప్తులో తేలింది. బ్యాంకు అధికారులు మోసగాళ్లతో చేతులు కలిపి నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.

