అమరావతి ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం-ముగ్గురు నవజాత శిశువులు మృతి
అమరావతి: మహారాష్ట్రలోని అమరావతిలో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అమరావతి జిల్లా మహిళా ఆస్పత్రిలో మంటలు చెలరేగి ముగ్గురు నవజాత శిశువులు మృతిచెందగా,మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రి మూడో అంతస్తులోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం(SNCU)లో 39 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో వెంటిలేటర్ ఒక్కసారిగా పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. నిమిషాల్లో ఎల్ఎన్సీయూ మొత్తం వ్యాపించాయి. దీంతో పొగ పీల్చడం, తీవ్రమైన కాలిన గాయాలు కారణంగా ముగ్గురు శిశువులు ప్రాణాలు కోల్పోయారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే వైద్యులు, నర్సులు, ఇతర ఆస్పత్రి సిబ్బంది వార్డుకు చేరుకుని చిన్నారులను కాపాడారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురు నవజాత శిశువులను చికిత్స నిమిత్తం సమీపంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు.ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.

