షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎలక్ట్రిక్ బస్సు అగ్నికి అహుతి
హైదరాబాద్: కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వస్తున్న ఎలక్ట్రిక్ బస్సు, షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులను దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ డిపోనకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఆదివారం ఉదయం 8 గంటలకు కరీంనగర్ నుంచి హైదరాబాద్కు 40 మంది ప్రయాణికులతో బయల్దేరింది. బస్సు అలుగునూరు దాటిన తర్వాత కాకతీయ కాలువ సమీపంలోకి రాగానే షార్ట్ సర్క్యూట్ కారణంగా చిన్న మంట మొదలైంది. ఇది గమనించి డ్రైవర్ అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కకు నిలిపేడు. బస్సు డోర్తో పాటు ఎమర్జెన్సీ డోర్ ను ఓపెన్ చేసి ప్రయాణికులను వెంటనే బస్సులో నుంచి బయటకు దించేశాడు.
ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపిన తర్వాత బస్సులోని అగ్నిమాపక పరికరాలను ఉపయోగించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికి,అప్పటికే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో అదుపులోకి రాలేదు. నిమిషాల్లో వ్యవధిలో బస్సు మొత్తానికి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

