తెలంగాణలో ప్రజల సమస్యలు వినేలా జనవాణి నిర్వహణ-జనసేనాని పవన్ కళ్యాణ్
తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభం..
హైదరాబాద్: ‘నేను తెలంగాణ ఆత్మను అర్ధం చేసుకున్నవాడిని. ఇక్కడి నేల, పోరాటం, త్యాగాలు అన్ని నాకు స్ఫూర్తినిచ్చాయి. తెలంగాణలో కులరహితంగా యువత సాగించే హక్కుల పోరాటాలు ఎంతో విలువైనవి. ఇది పోరాటాల నేల.. ధన్యభూమి. తెలంగాణలో జనసేన పార్టీ తన రాజకీయ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుంద’ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని శుక్రవారం హైదరాబాద్ లోని మణికొండ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కొత్తగా పార్టీలో చేరిన వారి సమక్షంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తెలంగాణలో పార్టీ ప్రయాణం ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై దిశానిర్దేశం చేశారు.
కేరళం, తమిళనాడు, కర్ణాటక:- ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘జనసేన పార్టీ సిద్దాంతాలు భావజాలాన్ని నమ్మి నాతో ఇంతకాలం ప్రయాణం చేసిన నాయకులు ఇక మీదట కీలక భూమిక పోషించాలి. జనసేన పార్టీ సిద్ధాంతాలు విస్తరిస్తున్నాయి. కేరళం, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లోని వారు సైతం పార్టీ కోసం పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణలో చిన్నగా ఎలా అయితే పార్టీ మొదలైందో అలాగే ఆయా రాష్ట్రాల్లోనూ ఇప్పుడు పార్టీకి బలం వస్తోందన్నారు.

