పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపధ్యంలో దేశంలో పెరిగిన వంటగ్యాస్ ధరలు
అమరావతి: పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్తో ఇరాన్ యుద్ధం నేపథ్యంలో, దేశంలో స్వల్పంగా వంట గ్యాస్ ధరలను ఇంధన సంస్థలు పెంచాయి. గృహ వినియోగ LPG సిలిండర్పై రూ.60, కమర్షియల్ సిలిండర్పై రూ.115 పెంచుతూ చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయం శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. ఇంత వరకు గృహ వినియోగ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.853 ఉండగా, నేటి నుంచి రూ.913కి చేరింది. హైదరాబాద్లో సిలిండర్ ధర రూ.965కి, ముంబైలో రూ.930కి చేరింది.చెన్నైలో రూ.868 .50 నుంచి రూ.928.50కి పెరిగింది. ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మాత్రం మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. అమెరికా, ఇజ్రాయెల్తో ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్లోనూ ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.గతంలో డబుల్ సిలెండర్ ఉన్న వినియోగదారులు రెండవ సిలెండర్ ను వెంటనే బుక్ చేసుకుంటే, సంబంధిత డీలర్లు డెలివరీ ఇచ్చేవారు. ప్రస్తుతం మొదటి సిలెండర్ డెలివరీ తేది నుంచి 25 రోజులు గడిస్తేనే,బుక్ చేసుకుంటాము అంటూ మెసేజ్ లు చమురు సంస్థలు ఇస్తున్నాయి.

