అధికారులపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవు-మంత్రి నారాయణ
నెల్లూరు: ప్రజలకు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వ పరిపాలన ఉంటుందని, అందుకు తగినట్లుగానే అధికారులు పనిచేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖమంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తో కలసి హౌసింగ్, రెవెన్యూ, ఎక్సైజ్, మైన్స్, విద్యుత్ శాఖల పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల పనితీరుపై మంత్రి ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించడమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని ఘంటాపథంగా చెప్పారు. అధికారులపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని తెలియజేశారు. ప్రజల కనీస అవసరాలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళుతున్నామన్నారు. త్వరలోనే మరోసారి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి ఆయా శాఖల ద్వారా ప్రజలకు అందాల్సిన సంక్షేమాభివృద్ధిపై చర్చిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా ఏ ప్రాంతంలోనైనా ప్రజలు సుఖంగా జీవించాలంటే ఆ ప్రదేశంలో రోడ్డు, నీరు, డ్రైన్, కరెంట్ తప్పనిసరిగా ఉండాలని, ఆ దిశగా నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేసే స్థలాల వద్ద చర్యలు చేపడుతామని చెప్పారు. ప్రభుత్వం బడ్జెట్ మంజూరు చేసే అధికారులు పనులు చేసేందుకు వీలుంటుందన్నారు. ఎలక్ట్రసిటీ, మైన్స్ పై మరోసారి క్షుణ్ణంగా చర్చిస్తామని తెలిపారు. నియమనిబంధనల ప్రకారం ప్రజలకు సుపరిపాలన అందించాల్సిన అవసరం ఉందన్నారు. లేఅవుట్స్ వేసేవారు నుడా నియమాలను పాటించాలని సూచించారు. నియమనిబంధనలు సరిగా ఉంటే వెంటనే మంజూరు పత్రాలను అందజేస్తామని తెలిపారు. అవకతవకలు జరిగాయని తెలిసిందని దానిపై కూడా మాట్లాడడం జరుగుతుందన్నారు.