అవసరానికి మించి ఎక్కువ నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు-జె.సి
నెల్లూరు: జిల్లాలో ఉల్లిపాయలు, టమోటాల ధరలు పెరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశం జె.సి నిర్వహించారు. ఎండ వేడిమి ప్రభావంతో టమోటాలు, ఉల్లిపాయలతో పాటు ఇతర కూరగాయలు దిగుబడులు గణనీయంగా తగ్గాయని, దీంతో ధరలు పెరిగాయని, ప్రతిఏటా ఇదే పరిస్థితి నెలకొంటుందని అన్నారు. టమోటాలు, ఉల్లిపాయల ధరలను స్థిరీకరించుటకు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పొరుగు జిల్లాల నుంచి టమోటాలు, ఉల్లిపాయలను సేకరించి రైతుబజార్లలో ద్వారా ఎలాంటి లాభనష్టాలు లేకుండా వినియోగదారులకు విక్రయించాలన్నారు. మార్కెటింగ్, పౌరసరఫరాలు, తూనీకల కొలతలు, ఉద్యాన, వ్యవసాయ శాఖల అధికారులతో ఏర్పాటైన విజిలెన్స్ కమిటీ ద్వారా వ్యాపారస్తుల దుకాణాలు, గోదాముల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎవరైనా అవసరానికి మించి ఎక్కువ నిల్వ చేసి అధిక ధరలకు విక్రయించినట్లు గుర్తిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను జె.సి ఆదేశించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ ఏడి అనితకుమారి, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, ఎపిఎంఐపి పిడి శ్రీనివాసులు, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటరమణ, తూనీకల కొలతల డిసి ఇసాక్, రైతు బజారు అధికారులు పాల్గొన్నారు.