ఇరాన్ తో శాంతి ఒప్పందం దాదాపు ఖరారైంది-డొనాల్డ్ ట్రంప్
అమరావతి: ఇరాన్ తో విస్తృత శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఒప్పందం తుది దశలో ఉందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. పాకిస్థాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, బహ్రెయిన్ దేశాల అధినేతలతో ఫోన్లో చర్చలు జరిపినట్లు తెలిపారు. అమెరికా, ఇరాన్తోపాటు పలు ఇతర దేశాల మధ్య ఈ ఒప్పందంపై చర్చలు చాలావరకు పూర్తయ్యాయని ట్రంప్ పేర్కొన్నారు. కేవలం తుది మెరుగులు మాత్రమే మిగిలి ఉన్నాయని అన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కూడా తాను ప్రత్యేకంగా మాట్లాడానని, ఆ చర్చలు కూడా సఫలమయ్యాయని ట్రంప్ చెప్పారు. ఒప్పందంలోని కీలక అంశాలను ప్రస్తావిస్తూ ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధిని పూర్తిస్థాయిలో తెరవనున్నట్లు స్పష్టం చేశారు. తుది వివరాలపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఒప్పందాన్ని ప్రకటిస్తామని ట్రంప్ తన పోస్ట్ ను ముగించారు.
ప్రతిపాదిత అవగాహన ఒప్పందం (MoU)లో, ముడి చమురు,గ్యాస్కు కీలకమైన షిప్పింగ్ మార్గమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, అలాగే ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని అధికారికంగా ముగించే లక్ష్యంతో చర్చలు జరపడం వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం.
ఇది ఎంత వరకు జరుగుతుందు? లేక ఇరాన్ పై దాడులు చేస్తారా అనేది తేలాల్సి వుంది….ట్రంప్ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రపంచం లేదు అనేది వాస్తవం…?

