ఉగ్రదాడి నేపథ్యంలో టీటీడీ అప్రమత్తం-కేంద్ర నిఘావర్గాల హెచ్చరికతో భద్రత కట్టుదిట్టం
తిరుపతి: కేంద్ర నిఘావర్గాల హెచ్చరికలతో తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. గురువారం ఆక్టోపస్, విజిలెన్స్, పోలీసు బలగాలు భారీగా మోహరించాయి..అలాగే తిరుమలకు వచ్చే భక్తుల భద్రత దృష్ట్యా మాక్డ్రిల్ నిర్వహిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలను భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. శ్రీవారి ఆలయ పరిసరాల్లోనూ భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటీవలే తిరుమలలో భద్రతా లోపాలపై కేంద్రం ఆరా తీసిన విషయం తెలిసిందే. భద్రతా వైఫల్యాలపై ఎంపీ గురుమూర్తి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. దీంతో స్పందించిన కేంద్రం భద్రతను కట్టుదిట్టం చేసింది. టీటీడీ పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని,, దానివల్లే సమన్వయ లోపం, భద్రత లోపం తలెత్తిందని ఎంపీ పేర్కొన్నారు. భక్తుల రక్షణకు అవసరమైన భద్రతా ఏర్పాట్లను మెరుగుపర్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. తిరుమలలో భద్రతా లోపాలు భక్తుల జీవితాలను ప్రమాదంలో పడేయడంతో పాటు, వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పవిత్రతను తీవ్రంగా దెబ్బతీశాయని తెలిపారు.