ప్రతి నెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమం-మంత్రి నారాయణ
నెల్లూరు: స్వచ్ఛమైన మనసుతో స్వచ్ఛమైన పాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తున్నదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ప్రతి నెలా మూడో శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంత్రి నారాయణ ఆధ్వర్యంలో దాదాపు 5000 మంది విద్యార్థిని విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలతో నెల్లూరు నగరంలోని వి ఆర్ సి సెంటర్ నుండి నర్తకి సెంటర్ వరకు భారీ స్వచ్ఛతా ర్యాలీ నిర్వహించారు. “ఈ – వేస్ట్ దహనం కాదు నిర్వహణ కావాలి, ప్లాస్టిక్ వాడకం తగ్గించండి, ఈ – వేస్ట్ ను మిగతా చెత్తతో కలప వద్దు, వాతావరణ కాలుష్యాన్ని అరికట్టండి-ప్రకృతిని రక్షించండి” అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు.వేలాదిగా హాజరైన విద్యార్థులు, ఇతరులతో మంత్రి నారాయణ స్వచ్చతా ప్రతిజ్ఞ చేయించారు. నెల్లూరు నగరపాలక సంస్థకు కేటాయించిన రోడ్లను శుభ్రం చేసే యంత్రాలను మంత్రి ప్రారంభించారు.తొలుత మంత్రి నారాయణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండి అనిల్ కుమార్ రెడ్డిలతో కలసి అల్లిపురంలోని డంపింగ్ యార్డ్ వద్ద బయో మైనింగ్ యూనిట్ ను ప్రారంభించారు.