వి.ఆర్.స్కూల్లో కార్పొరేట్ స్థాయి విద్య- కమిషనర్ సూర్య తేజ
ఈ విద్యా సంవత్సరంలో 840 మంది..
నెల్లూరు: పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆలోచనల మేరకు నగరంలోని వి.ఆర్.స్కూలును పునః ప్రారంభించి నిరుపేదలైన చిన్నారులకు కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా విద్యా వసతులను కల్పించనున్నామని కమిషనర్ సూర్య తేజ తెలియజేశారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వి.ఆర్.తరగతి గదుల నిర్మాణం పనులు పూర్తికావస్తున్నాయని, ఇప్పటివరకు ఏడు తరగతి గదులను డిజిటల్ క్లాస్ రూములుగా సిద్ధం చేశామని తెలిపారు. నర్సరీ నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.అత్యున్నత ప్రమాణాలతో విద్యార్థులకు విద్యాబోధనతో పాటు అల్పాహారం,స్నాక్స్, భోజన వసతి, దుస్తులు, పుస్తకాలు అన్ని ఉచితంగా అందించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఇంటి వద్ద నుంచి విద్యార్థులను ఉచిత బస్సు ద్వారా ద్వారా స్కూలుకు తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో అత్యంత నిరుపేదలుగా ఉన్న కుటుంబాల చిన్నారులు, అనాధలుగా ఉన్నవారు, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారు, దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారిని గుర్తించి అడ్మిషన్లలో వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.విద్యతోనే ఉన్నతమైన భవిష్యత్తు అన్న ఆలోచనతో చేస్తున్న ప్రయత్నంలో ఈ విద్యా సంవత్సరంలో 840 మంది చిన్నారులకు అడ్మిషన్ కల్పించనున్నామని, వచ్చే ఏడాది నుంచి పదవ తరగతి విద్యాబోధన కూడా జరిగేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలియజేశారు.